Tuesday 14th of May 2024

విలువైనది ఓటు

13 Dec , 2023 11:59 , IST
Article Image

ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనదని దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్‌ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో మంగళవారం ఆయన మాక్‌పోలింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిలో ఓటు వేసే విధానాన్ని స్వయంగా డెమో ద్వారా ఓటర్లకు కలెక్టర్‌ వివరించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంల ప్రదర్శన కేంద్రం ఏర్పాటుచేశామన్నారు. ఇదే తరహాలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమం 40 రోజులు జరుగుతుందన్నారు. బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌లు ఉంటాయన్నారు. సంచార అవగాహన వాహనంలో నమూనాలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తామని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఓటు వేసే విధానంపై ప్రజలకు సందేహాలు ఉంటే ఈ కేంద్రం వద్ద ఉన్న ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్‌, కలెక్టరేట్‌ కో–ఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌, కలెక్టరేట్‌ ఏవో ఏఎస్‌ఎన్‌ రాధిక, డెప్యూటీ తహసీల్దార్‌ ఎంవీ శ్యామ్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు. .