Monday 29th of April 2024

ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు!

19 Dec , 2023 01:27 , IST
Article Image

అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వేడుకల్లో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియంలో అంతర్జాతీయ సాహితీ సదస్సును ఏర్పాటు చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ సినీ నటుడు, కవి రచయిత తనికెళ్ళ భరణి ప్రారంభించగా, ప్రముఖ కవి, రచయిత కొలకలూరి ఇనాక్ సభ అధ్యక్షత వహించారు. ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఇతర ఆటా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ సినీ నటుడు, కవి రచయిత తనికెళ్ళ భరణి, ప్రముఖ కవి, రచయిత కొలకలూరి ఇనాక్లు ప్రసంగించారు.తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఆటాకు అమితమైన ప్రేమ వుందని ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుందని అన్నారు. అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో అమెరికా భారతి పేరుతో మాస పత్రిక ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తూ తెలుగు పై వారికి వున్న ప్రేమకి నిదర్శనం అని అన్నారు. అలాగే అమెరికాలో తెలుగు చదువుకోవడానికి యువతకు అన్ని విధాల సహకరిస్తున్న ఘనత ఆటా దేనని అన్నారు. అలాగే తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలు అందజేసి వెలికితీసే ప్రక్రియను ఆటా చేయడం గొప్పగా ఉన్నదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియా రంగం అనే అంశంపై ప్రముఖ రచయిత కాసుల ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహించగా టీవీ ప్రసారాలు అప్పుడు-ఇప్పుడు అనే అంశంపై శాంతి స్వరూప్, శ్రోతల జీవితాన్ని నిర్దేశించిన రేడియో అంశంపై అయినంపుడి శ్రీ లక్ష్మి, నూతన మాధ్యమాలు సత్యసత్యాలు అంశంపై ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్, ఇవాళ్టి తెలుగు పరిశోధకులకు మార్గదర్శనం అంశంపై సంగిశెట్టి శ్రీనివాస్, సాంకేతిక యుగంలో సాహిత్య పాత్ర అంశంపై స్వామి ముద్దం తమ భావనలను వివరించారు. అనువాదం, నాటకం అవధానం అనే అంశంపై రూప్ కుమార్ డబ్బికార్ అధ్యక్షతన రెండవ సమావేశం నిర్వహించగా, అనువాదంలో చిక్కులు సమస్యలు అంశంపై జే.ఎల్ రెడ్డి, అనువాద సాహిత్యం-అవశ్యకత అంశంపై నలిమెల భాస్కర్, తెలుగు నాటకం తీరు తెన్నులు అంశంపై దెంచానాల శ్రీనివాస్, పరిశోధన, విమర్శ, సమాలోచనలు అంశంపై కొలకలూరి మధుజ్యోతి, అవధానంలో చమత్కారం అంశంపై నరాల రామ్ రెడ్డి వారి ఆలోచనలను పంచుకున్నారు తెలుగు కథలు, నవల, విశ్లేషణ అనే అంశంపై వెల్దండి శ్రీధర్ అధ్యక్షతన 3వ సమావేశం నిర్వహించగా జీవన స్రవంతి నవల-అనుభవాలు అనే అంశంపై టేకులపల్లి గోపాల్ రెడ్డి, నవల సాహిత్యంలో కొత్త పోకడలు అంశంపై మధురంతకం నరేంద్ర, యువతపై నవల సాహిత్య ప్రభావం అంశంపై మధుబాబు, తరాల తెలుగు కథ అంశంపై పెద్దింటి అశోక్ కుమార్, తెలుగు సాహిత్యంలో నవల ప్రాధాన్యత అంశంపై సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి, కథల్లో కొత్తదనం అనే అంశంపై మొహమ్మద్ గౌస్, కథ-సమాజం అంశంపై హుమాయూన్ సంఫీుర్ తమ భావనలను వివరించారు. ఆధునిక కవితా పరిణామాలు అనే అంశంపై కవి యాకూబ్ అధ్యక్షతన 4వ సమావేశం నిర్వహించగా ఎస్.వి సత్యనారాయణ, మువ్వా శ్రీనివాస్ రావు, నాలేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, మందారపు హైమవతి, కొండపల్లి నిహరిని, కందుకూరి శ్రీరాములు, పద్య కవితా శిల్ప సౌందర్యం అంశంపై జిల్లేపల్లి బ్రహ్మం తమ భావాలు వివరించారు. గేయ సాహిత్యం అనే అంశంపై రవీందర్ పసునూరి అధ్యక్షతన 5వ సమావేశం నిర్వహించగా ప్రముఖ గేయ రచయితలు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, దేశపతి శ్రీనివాస్, పెంచలదాసు, కాసర్ల శ్యామ్ తమ పాటలతో ఉర్రూతలూగించారు. సినిమా సాహిత్య మేళవింపు అనే అంశంపై సినీ నటుడు తనికెళ్ళ భరణి అధ్యక్షతన 6వ సమావేశం నిర్వహించగా జనాభా దృశ్య కళా రూపాలు-ప్రదర్శన పద్దతులు అనే అంశంపై తప్పెట రామ్ ప్రసాద్ రెడ్డి, సినిమాల్లో జానపద కళారూపాలు అంశంపై బలగం వేణు, దృశ్య మాధ్యమంలో చారిత్రక అంశాలు అంశంపై అల్లని శ్రీధర్, సినిమా విమర్శ అంశంపై మామిడి హరికృష్ణ, దృశ్య మాధ్యమంలో తెలుగు కవిత్వం అంశంపై మొహమ్మద్ షరీఫ్ తమ భావనలను వివరించారు.ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ముగింపు వేడుకలకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విసి టి.కిషన్ రావు సభ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మాజీ తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మెన్ జులురు గౌరీశంకర్, మాజీ బాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆటా చేస్తున్న సాహిత్య సేవ మరువలేనిది అన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసిన ఆటా వారికి ధన్యవాదాలు తెలిపారు..