Tuesday 14th of May 2024

టీటీడీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించండి

13 Dec , 2023 12:26 , IST
Article Image

తిరుపతి(అలిపిరి): తిరుపతి, ఇతర ప్రాంతాల్లోని టీటీడీ స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో వెబ్‌సైట్‌ను ఆధునీకరించాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం స్థానిక ఆలయాలపై ఈఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీటీడీలో 60కి పైగా స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాలున్నాయని, వీటికి సంబంధించిన స్థలపురాణం, ఆర్జిత సేవలు, దర్శన వేళలు, ఇతర సౌకర్యాలను వెబ్‌సైట్‌లో భక్తులకు తెలియజేయాలని కోరారు. గతంలో కరపత్రాలు, విభిన్న పద్ధతుల్లో ప్రచార సామగ్రిని భక్తులకు అందుబాటులో ఉంచేవారమని, ఇటీవల భక్తులు డిజిటల్‌ మీడియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వెబ్‌సైట్‌ను ఆధునీకరించాలని సూచించారు. ఎస్వీబీసీ ద్వారా ఆలయ విశిష్టతకు సంబంధించి స్వల్ప వ్యవధితో వీడియో క్లిప్‌లు రూపొందించి వివిధ మాధ్యమాల్లో జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కోరారు. దీంతో ఎక్కువమందికి ఆలయాల సమాచారం తెలుస్తుందన్నారు. సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్‌ఏసీఏఓ బాలాజీ, డిప్యూటీ ఈఓ(జనరల్‌) శివప్రసాద్‌, ఐటీ జీఎం సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. .