పెదవేగి: ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ పేరుతో డిసెంబర్ 14 నుంచి దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదవేగి మండలం కొండలరావుపాలెం క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ పోస్టర్ను ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పార్టీ శ్రేణులతో కలసి ఆవిష్కరించారు. డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 22 వరకు మొదటి విడత ప్రజా ఆశీర్వాద యాత్రను దుగ్గిరాల నుంచి దెందులూరు వరకు 100 కిలోమీటర్ల మేర చేయనున్నారు. పెదవేగి, దెందులూరు మండలాల్లోని 23 గ్రామాల్లో 9 రోజుల పాటు జరగనున్న ప్రజా ఆశీర్వాద యాత్రకు ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ రాజన్న, జగనన్న చేపట్టిన పాదయాత్రల స్ఫూర్తితో ఈ ప్రజా ఆశీర్వాద యాత్రను చేపడుతున్నానని అన్నారు. ఈ ఐదేళ్లలో జగనన్న ఆశీస్సులతో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు అందించిన సంక్షేమాన్ని వివరించి ప్రజల ఆశీర్వాదం పొందేందుకే ఈ ప్రజా ఆశీర్వాద యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రజలకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భయపడిపోవడానికి ఇది గతంలోని దెందులూరు కాదని కొఠారు ఇక్కడ ఉన్నంత కాలం ప్రతిపక్షాలు ఏమీ చేయలేవని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో దెందులూరు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసి, ప్రగతి పథాన నిలుపుతానని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏఎంసీ చైర్మన్ అప్పన కనకదుర్గ ప్రసాద్, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు..