Tuesday 14th of May 2024

అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం

13 Dec , 2023 03:55 , IST
Article Image

నియోజకవర్గంలో మంచి పాలన తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌లో వ్యాపారులు, పోలీసులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, స్వేచ్ఛగా వారి పని చేసుకోవచ్చన్నారు. గతంలో నాయకులు తమ ఇంటికి వచ్చేందుకు కూడా భయపడ్డారని, సమాచారం తెలుసుకుని వారిపై కొందరు నాయకులు ఒత్తిడి తెచ్చేవారన్నారు. తన గెలుపునకు సహకరించిన కార్యకర్తలు, ఆప్తులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో కొంతమందిని కలవలేకపోయినా మద్దతు ఇచ్చారని, రానున్న రోజుల్లో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలే కాకుండా మిగతా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశారని, మిగతావి కూడా త్వరలో పూర్తవుతాయని వివరించారు. నాగర్‌కర్నూల్‌లో చేయాల్సిన అభివృద్ధి పనులపై త్వరలో శాఖల వారిగా సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి నాయకులు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, అశోక్‌, ఆంజనేయులు, కందికొండ గీత, గోపస్‌ లక్ష్మణ్‌, అంతటి కాశన్న తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ అభివృద్ధిలో తనకు సహకరించాలని వారిని కోరినట్లు చెప్పారు..