కార్తీక మాసం చివరి మంగళవారం అమావాస్య సందర్భంగా ఉదయం మెట్టుగుట్ట మెట్టురామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి, 54 కిలోల అన్నంతో అన్నాభిషేకంతో అలంకరణ చేశారు. రామాలయంలో సీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక అర్చనలు చేశారు. శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేరులో మంగళవారం సాయంత్రం గంగాహారతి శోభాయమానంగా జరిగింది. కార్తీక మాసోత్సవం ముగింపులో భాగంగా ఆలయంలో ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ప్రాతఃకాలపూజలు, స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం నెల రోజుల్లో భాగంగా రుద్రాహోమం, మహాపూర్ణాహుతి జరిపారు. మార్గశిర మాసం మొదటి రోజు బుధవారం ఉదయం గౌరీనక్తపూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధానార్చకుడు తెలిపారు. .