Tuesday 14th of May 2024

పక్కాగా ‘పల్లె’ పద్దు!

13 Dec , 2023 07:15 , IST
Article Image

పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం నెలరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఆదాయవ్యయాలు, నిధుల వివరాలు ఎవరైనా తెలుసుకునే వీలుంది. గ్రామపంచాయతీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన నిధులు.. వ్యయం.. మిగులు తదితర వివరాలు తెలుసుకునేందుకు కేంద్రం ఈ–గ్రామ్‌ స్వరాజ్‌ యాప్‌ను మూడేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగే పనులను నిలిపివేసేందుకు పారదర్శకత కోసం చొరవ చూపింది. ఈ యాప్‌ ద్వారా గ్రామపంచాయతీ సమగ్ర సమాచారం తెలుసుకునే మార్గాన్ని సులభతరం చేసింది. యాప్‌లో ప్రతీ లెక్క పక్కాగా పొందుపరచి ఉంటుంది. దీని గురించి చాలామందికి అవగాహన లేకపోవడంతో పంచాయతీ ఆదాయ, వ్యయ వివరాలు తెలుసుకోలేకపోతున్నారు.గ్రామపంచాయతీ నిధులు.. చేపట్టిన పనుల వివరాలు వార్డుల వారీగా ఎప్పటికప్పుడు యాప్‌లో అప్లోడ్‌ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధుల వివరాలు.. విడుదల కావాల్సిన నిధుల వివరాలు యాప్‌ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. గ్రామపంచాయతీ పాలకవర్గాలు కూడా పొరపాట్లకు తావివ్వకుండా ప్రతీపైసాను లెక్క ప్రకారం ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి సర్పంచ్‌, వార్డు సభ్యుల వరకు ఎవరు ఏ తప్పుడు నివేదికలు చూపినా ఈ–గ్రామ్‌ స్వరాజ్‌ యాప్‌ ద్వారా పౌరులు ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టవచ్చు.మొబైల్‌ ఫోన్లలో ప్లే స్టోర్‌లో ఈ–గ్రామ్‌ స్వరాజ్‌ అనే యాప్‌ మొదట డౌన్లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్‌ అయిన తర్వాత ఓపెన్‌ చేస్తే మొదటి పేజీలో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం.. తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వాటిని ఎంపిక చేసుకున్న అనంతరం క్లిక్‌ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన ఆదాయవ్యయాలు, నిధుల పూర్తి సమాచారం వార్డుల వారీగా నమోదై ఉంటుంది.జిల్లాలో 19 మండలాలుండగా 396 గ్రామపంచాయతీలున్నాయి. ప్రతీ గ్రామపంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనులు, ఆర్థిక పురోగతి, ఆస్తులు.. జియో ట్యాగింగ్‌ ద్వారా ఈ యాప్‌లో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని పొందుపరచాల్సిన బాధ్యత పంచాయతీరాజ్‌శాఖది. పంచాయతీ పాలక వర్గాల పేర్లు.. పంచాయతీ కార్యదర్శి వివరాలు.. మంజూరైన నిధులు.. ఏయే పనులకు ఎంత వ్యయం చేశారు.. ఆ పనుల ప్రస్తుత పురోగతి తదితర అంశాలు కూడా అందుబాటులో ఉంటాయి. అంచనా వ్యయాలు అభివృద్ధి పనుల నివేదికలు ఇందులో క్లుప్తంగా పొందుపరచబడి ఉంటాయి. జీపీఆర్‌ఎస్‌ ద్వారా గుర్తించడంతో ఒకసారి చేసిన పనులకు మరోసారి బడ్జెట్‌ కేటాయించడానికి అవకాశం ఉండదు. తద్వారా నిధులపై పారదర్శకత ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఈ–గ్రామ్‌స్వరాజ్‌ యాప్‌ అమలు జరుగుతుంది. .