కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని పట్టణంలోని శ్రీకృష్ణనగర్ శివాలయంలో సాయంత్రం వేళ లక్ష దీపోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణానికి చెందిన మహిళలు అధికసంఖ్యలో తరలివచ్చి ఆలయంలో ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆవరణలో దీపాలు వెలిగించారు. ప్రతి ఏడాది కార్తీక మాసం చివరి సోమవారం దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పూజారి జంగం జగదీశ్ తెలిపారు. కార్యక్రమంలో మేర్వరాజు, పి.రాజు పాల్గొన్నారు.మండలంలోని కానాయపల్లి శ్రీ దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో 15 రోజులుగా కొనసాగుతున్న కోటిలింగాల ప్రతిష్టాపన మహోత్సవం సోమవారం ముగిసింది. కార్తీక సోమవారం, చివరిరోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. రుద్రహోమం నిర్వహించి శివకోటి యంత్రాల ద్వారా పదకొండు వేల లింగాలను భక్తులు స్వహస్తాలతో ప్రతిష్టించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, మాజీ ఎంపీపీ రమాదేవి దంపతులు పాల్గొన్నారు.కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కానాయపల్లి శ్రీదత్తకోటి లింగేశ్వరస్వామి ఆలయాన్ని ఆత్మకూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శిరీష దంపతులు దర్శించుకున్నారు. నిర్వాహకులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజ లు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు..