పేద మహిళలకు ఎంతగానో ఉపయోగపడిన అభయ హస్తం పథకాన్ని గత ప్రభుత్వం రద్దుచేసిందని దీనిని మరింత మెరుగు పరిచి పునరుద్ధరించాలని తెలంగాణా బీమామిత్ర ఉద్యోగ సంఘం నాయకలు మంగళవారం రాత్రి ప్రజాభవన్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అభయ హస్తం పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది మహిళలు లబ్ధిపొందేవారని అన్నారు. గత ప్రభుత్వం 2017లో బీమా పథకం, 2020లో అభయ హస్తం పథకాలను రద్దు చేసిందని దీంతో ఈ పథకంలో సభ్యులకు ఎలాంటి లబ్ధి జరగడం లేదని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. గ్రామీణ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ పథకంలో కావాల్సిన మార్పులు చేసి తిరిగి ప్రారంభించాలని వారు కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీమా మిత్ర ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అనిలారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ తదితరులు ఉన్నారు.తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మీర్పేట కార్పొరేషన్ పరిధి ఆర్ఎన్రెడ్డి నగర్కు చెందిన జి.వేదభవానీ నియమితులయ్యారు. ఈ మేరకు సమితి రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్సన్ బుధవారం భవానీకి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ఉద్యమకారుల సంక్షేమానికి పాటుపడుతున్న తనను గుర్తించి పదవికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి వెంకన్న, ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి, యుగంధర్, రవీందర్, అశోక్, కృష్ణగుప్తా, శివకుమార్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.రేషన్ దుకాణాల నిర్వహణలో డీలర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. ఆమనగల్లు పట్టణంలోని పౌరసరఫరాల శాఖ గోదామ్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. గోదామ్లో ఉన్న స్టాక్ను, రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడే ఉన్న కొందరు డీలర్లతో ఆయన మాట్లాడారు. డీలర్లు చౌకధర దుకాణాల ద్వారా రేషన్ సరుకులను ప్రజలకు సక్రమంగా అందించాలని.. అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకోవడంతో పాటు డీలర్షిప్ను రద్దు చేయడానికి సిఫారసు చేస్తామని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ గోదామ్ నిర్వహణపై డీలర్లు మౌఖికంగా కాకుండా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. గోదామ్లో బియ్యం బస్తాలను తూకం వేసిన తర్వాతే పంపించాలని ఆయన సూచించారు. డిసెంబర్ నెల ప్రారంభమై 13 రోజులు దాటినా ఇంకా రేషన్ దుకాణాలకు బియ్యం ఎందుకు పంపించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తీరుమార్చుకోకుంటే చర్యలు తప్పవన్నారు. .