Monday 13th of May 2024

'అమ్మవారి మాల' తీసి మరీ.. భార్యను కిరాత‌కంగా..

14 Dec , 2023 03:28 , IST
Article Image

భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఓ భర్త ఉదంతం నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, సీఐ రాంబాబు కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు చెందిన రమావత్‌ బోడియ్యనాయక్‌, భుక్యా సుజాత(28) దంపతులు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రెండేళ్ల క్రితం వీరు గుంటూరు నగర శివారుల్లోని చౌడవరం పరిధిలోని చండ్రరాజేశ్వరరావు నగర్‌కు వలస వచ్చారు.ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. బోడయ్య ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా, సుజాత మిర్చియార్డులో కూలి పనులు చేస్తుండేది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానంతో బోడయ్య ఆమెను ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. నెల రోజుల క్రితం బోడయ్య అమ్మవారి మాల ధరించాడు. సుజాతపై మరింత అనుమానం పెంచుకున్న బోడయ్య మంగళవారం మళ్లీ ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో రాత్రి సమయంలో బోడయ్య తాను ధరించిన మాలను తీసి ఇంటికి వచ్చాడు. ఫలితంగా భార్యాభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది.ఈ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన బోడయ్య సుజాత మెడకు చున్నీ చుట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం బంధువులకు ఫోన్‌ చేసి తన భార్యను హత్య చేసినట్లు చెప్పి ఆటోతో సహా పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహానికి జీజీహెచ్‌లో పోస్ట్‌ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు..