Monday 29th of April 2024

ఏడాది తిరగకముందే భార్యకు కటీఫ్‌.. నాలుగోసారి ప్రేమలో మ్యూజిక్‌ డైరెక్టర్‌..

14 Dec , 2023 03:52 , IST
Article Image

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్‌ వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొంతకాలంగా గోపి.. అతడి భార్య, సింగర్‌ అమృత సురేశ్‌ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. గోపి సుందర్‌ ఈ మధ్య యూరప్‌లో సంగీత విభావరి (కన్సర్ట్‌)కి వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఈ ఫోటోల్లో మయోని అలియాస్‌ ప్రియ నాయర్‌తో సన్నిహితంగా కనిపించాడు. న్యూజిలాండ్‌ ట్రిప్‌కు కూడా తనను వెంటేసుకుని వెళ్లాడు. దీపావళి కూడా ఆమెతోనే సెలబ్రేట్‌ చేసుకున్నాడు.ఈ ఫోటోలను ప్రియ నాయర్‌ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'ఎలా ప్రేమించాలి? ఎలా జీవించాలి? అనే విషయాలను నేర్పిన వ్యక్తితో సంతోషకర క్షణాలు' అని సదరు పోస్ట్‌కు క్యాప్షన్‌ జోడించింది. దీంతో వీరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందని అభిమానులు అనుమానిస్తున్నారు.  కాగా గోపి సుందర్‌ గతంలో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మాధవ్‌, యాదవ్‌ అని ఇద్దరు సంతానం. అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. తర్వాత సింగర్‌ అభయ హిరణ్మయితో తొమ్మిదేళ్లకుపైగా సహజీవనం చేశాడు. కానీ ఈ రిలేషన్‌ కూడా ముక్కలైపోయింది.గతేడాది సింగర్‌ అమృత సురేశ్‌ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు గోపి సుందర్‌. కానీ ఏడాది గడిచేలోపు పరిస్థితులు తారుమారయ్యాయి. వీరిద్దరూ సోషల్‌ మీడియాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. బయట కూడా ఎక్కడా కలిసి కనిపించలేదు. ఇద్దరూ విడివిడిగానే ట్రిప్పులకు వెళ్తున్నారు. దీంతో వీరు విడిపోయారని నెటిజన్లు ఫిక్సయిపోయారు. అటు విడాకుల వార్తలపై గోపి, అమృత సైతం ఇంతవరకు స్పందించనేలేదు. తాజాగా మరో అమ్మాయితో గోపి సుందర్‌ క్లోజ్‌గా కనిపించడంతో అతడు నాలుగోసారి లవ్‌లో పడ్డాడంటూ కామెంట్లు చేస్తున్నారు..