అది దేశ చట్టసభ్యులు సమావేశం అయ్యే చోటు. అత్యున్నత చట్టాల రూపకల్పన.. పాత వాటికి సవరణలు జరిగే చోటు. కాబట్టి.. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని అంతా భావించడం సహజం. కానీ, రెండు దశాబ్దాల కిందట పార్లమెంట్ మీదే జరిగిన ఉగ్రదాడి భారత్కు మాయని మచ్చని మిగిల్చింది. మళ్లీ అదే తేదీన, కొత్తగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంట్ వద్ద మళ్లీ అలాంటి అలజడే ఒకటి చెరేగింది. ఏకంగా దిగువ సభ లోపల ఆగంతకులు దాడికి దిగడంతో ‘పార్లమెంట్లో భద్రతా తీవ్ర వైఫల్యం’ గురించి చర్చ నడుస్తోంది. ఇక్కడ దాడి జరిగింది లోక్సభలోనా? రాజ్యసభలోనా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం అనేది తీవ్రమైన అంశం. ఇంత విస్తృతమైన భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? భద్రతా ఉల్లంఘనకు ఎలా పాల్పడ్డారు? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.. లోక్సభ ఘటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసిన ఆందోళన. ఈ వాదనకు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ సైతం సానుకూల స్థాయిలోనే స్పందించడం గమనార్హం. ఇంతకీ పార్లమెంట్ భద్రతను పర్యవేక్షించాల్సింది ఎవరు?.. ఢిల్లీ పోలీసులా? కేంద్ర బలగాలా?.. తాజా పార్లమెంట్ దాడి ఘటన నేపథ్యంలో ఓ సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ఈ అంశంపై స్పందించారు. పార్లమెంట్ బయట వరకే భద్రత కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యత. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భద్రత మాత్రం ఢిల్లీ పోలీసుల పరిధిలోకి రాదు. అయితే లోపలి భద్రతను మొత్తం పర్యవేక్షించేది పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్(Parliament Security Services..PSS). పీఎస్ఎస్ సీఆర్పీఎఫ్గానీ, మరేయిత కేంద్ర బలగాల సమన్వయంతో అంతర్గత భద్రత పర్యవేక్షిస్తుంటుంది. బహుశా ఇవాళ్టి ఘటనలో నిందితుల్ని వాళ్లే అదుపులోకి తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. ఈ అధికారి వ్యాఖ్యలకు తగ్గట్లే.. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేదాకా నిందితులు పార్లమెంట్ భద్రతా సిబ్బంది అదుపులోనే ఉన్నారు. ఆపై వాళ్లకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకీ భద్రతా సంస్థల కలగలుపు పీఎస్ఎస్ ఎలా పని చేస్తుందంటే.. 1929 ఏప్రిల్ 8వ తేదీన అప్పటి పార్లమెంట్ భవనం సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి జరిగింది. ఆ దాడి తర్వాత అప్పుడు సీఎల్ఏకు అధ్యక్షుడిగా ఉన్న విఠల్భాయ్ పటేల్ చట్ట సభ, అందులోని సభ్యుల భద్రత కోసం సెప్టెంబర్ నెలలో ‘వాచ్ అండ్ వార్డ్’ పేరిట ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ సర్ జేమ్స్ క్రెరార్ ‘డోర్ కీపర్ అండ్ మెసేంజర్స్’ పేరిట 21 మంది సిబ్బందిని చట్టసభ కాంప్లెక్స్లో నియమించాలని ప్రతిపాదించారు. భద్రతతో పాటు చట్ట సభ్యులకు ఏదైనా సమాచారం అందించాలన్నా వీళ్ల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారాయన. అయితే.. .