Tuesday 14th of May 2024

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతికి రాక

13 Dec , 2023 11:48 , IST
Article Image

తిరుపతి అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తిరుపతికి రానున్నారు. తనపల్లె సమీపంలోని తాజ్‌ హోటల్‌లో శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ వెంకటరమణారెడ్డితో పాటు ఎస్పీ పరమేశ్వరరెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం తిరుచానూరు సమీపంలోని తాజ్‌ హోటల్‌లో అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా విషయంలో చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్‌రెడ్డి, ఏఎస్పీలు కులశేఖర్‌, విమలకుమారి, డీఎంహెచ్‌ఓ శ్రీహరి, ఆర్‌అండ్‌బీ శాఖ జిల్లా అధికారి సుధాకర్‌రెడ్డి, జిల్లా ఫైర్‌ అధికారి రమణయ్య పాల్గొన్నారు.బుధవారం సాయంత్రం 4.15కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక విమానంలో బయలుదేరి 5.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.15గంటల వరకు ఎయిర్‌ పోర్టులో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం 5.30 గంటలకు తాజ్‌ హోటల్‌కు చేరుకుని, శ్రీసిటీ ఎండీ రవిసన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. 5.45 గంటలకు తాజ్‌ హోటల్‌ నుంచి బయలు దేరి, 6 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని గన్నవరానికి బయలుదేరి వెళ్తారు. .